Thursday, 15 September 2016

ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు మనమే చేసుకుందాం!


ఆధార్ కార్డు తీసుకున్నాం.. పేరులో తప్పు దొర్లింది... లేదా చిరునామా మారింది.  పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ లేదా ఇతరత్రా సమాచారంలో ఏదేనీ మార్పులు చోటు చేసుకుంటే వాటిని సరిచేసుకోవడం చాలా సులభం. నెట్ సదుపాయం ఉంటే ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ కు వెళ్లి స్వయంగా మనమే సరిచేసుకోవచ్చు. అదెలానో చూద్దాం... 
ముందుగా 
https://ssup.uidai.gov.in/web/guest/update వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను టైప్ చేయాలి. సెండ్ ఓటీపీ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేస్తే తర్వాతి పేజీకి వెళతాం. 
ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్... వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా ఏదేనీ డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి దాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా యూటీఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది. 
కొత్త వివరాలు ఆధార్ లో చోటు చేసుకున్నాయా.. లేదా అనే దానిని పరిశీలించేందుకుhttps://ssup.uidai.gov.in/web/guest/check-status సైట్ కు వెళ్లాలి. ఆధార్ నంబర్, యూఆర్ఎన్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్ లేక అప్రూవల్ అయిందా అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు. 
ఇందుకు https://eaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి ఎన్ రోల్ మెంట్ నంబర్, లేదా ఆధార్ నంబర్ ఏది ఉంటే దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నంబర్ ను కిందనున్న కాలమ్ లో ఎంటర్ చేయాలి. పూర్తి పేరు. పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్ లోడ్ అవుతుంది. 
రిజిస్టర్ మొబైల్ నంబర్ మనుగడలో లేకుంటే
ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది. కనుక కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మీ దగ్గరే ఉండి, కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యమవుతుంది. అటువంటి వారు సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఆధార్ వివరాల అప్ డేట్ కాలమ్ లోనే మొబైల్ నంబర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మారిపోయి ఉంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్ట్ ద్వారానూ దరఖాస్తు పంపవచ్చు. 
చిరునామాలు
Address 1: UIDAI, Post Box No. 10, Chhindwara, Madhya Pradesh – 480001, India.
Address 2: UIDAI, Post Box No.99, Banjara Hills, Hyderabad – 500034, India.
కవర్ పైన స్పష్టంగా ఆధార్ అప్ డేట్ / కరెక్షన్ అని రాయాలి. అలాగే, పంపేవారి చిరునామానూ తప్పనిసరిగా పేర్కొనాలి. గుర్తింపు పత్రాన్ని కూడా జతచేయాలి. 

రైల్వే చార్జీల్లో రాయితీలు ఎవరెవరికి.. ఎంతెంత?

దేశంలో అత్యధిక జనాభాకు అనుకూలమైన, చవకైన రవాణా వ్యవస్థ రైల్వే. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చే భారతీయ రైల్వే... మనలో కొన్ని వర్గాల వారికి టికెట్ చార్జీల్లో భారీగా రాయితీలు అందిస్తోంది. వాటి వివరాలేంటో చూద్దాం. 
విద్యార్థులు, వికలాంగులు, ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారు, వైద్యులు, జర్నలిస్టులు, కళాకారులు, వృద్ధులు, జాతీయ పురస్కార గ్రహీతలు, అమరవీరుల భార్యలు, స్వాతంత్ర్య సమర యోధులు, క్రీడాకారులు, రైతు వర్గాల వారికి వివిధ రూపాలలో రాయితీలు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడు అన్ని వర్గాల వారికీ అనువైన సీజన్ టికెట్ ఉండనే ఉంది. 
15 రోజుల చార్జీకే
రెండు ప్రాంతాల మధ్య తరచూ ప్రయాణించే వారికి సీజన్ టికెట్లు అనువైనవి. నెలలో 15 రోజుల రానుపోను చార్జీ పెట్టుకుంటే మిగిలిన 15 రోజులు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. సాధారణంగా 150 కిలోమీటర్ల పరిధి మేరకు రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించేవారికి సీజన్ టికెట్లు జారీ చేస్తారు. సాధారణ, ఎక్స్ ప్రెస్ రైళ్లలో వీటితో ప్రయాణించవచ్చు. సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించాలంటే అదనంగా సర్ చార్జీ టికెట్ తీసుకోవాలి. తగిన గుర్తింపు పత్రాలతో రైల్వే టికెట్ కౌంటర్ల నుంచి సీజన్ టికెట్లు పొందవచ్చు. సీజన్ టికెట్ తో పాటు రైల్వే సిబ్బంది గుర్తింపు కార్డు కూడా జారీ చేస్తారు. ప్రయాణ సమయంలో ఈ రెండూ దగ్గర ఉంచుకోవాలి. గడువు తీరడానికి 3 రోజుల ముందు నుంచే రెన్యువల్ చేసుకోవచ్చు. 
విద్యార్థులకు మరింత చౌక
విద్యార్థులకు సీజన్ టికెట్లను సాధారణ సీజన్ టికెట్లలో సగం చార్జీకే పొందవచ్చు. మూడు నెలలకు ఒకేసారి తీసుకోవాలని అనుకుంటే ఇంకొంత తగ్గింపు లభిస్తుంది. పదో తరగతి వరకు అబ్బాయిలకు, ఇంటర్ వరకు విద్యార్థినులకు పాస్ లు ఉచితం. అంటే తమ నివాస ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాల్లోని స్కూళ్లు, కళాశాలలకు వెళ్లేందుకు వీలుగా వీటిని జారీ చేస్తారు. వీటితో పాసింజర్ రైళ్లలోనే ఉచితంగా ప్రయాణించవచ్చు.  రైల్వే టికెట్ కౌంటర్ నుంచి నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని తీసుకుని దాన్ని స్కూల్ లేదా కళాశాల ప్రిన్సిపాల్ నుంచి అటెస్టేషన్ చేయించి సమర్పించాల్సి ఉంటుంది. ఇక పెద్దల సీజన్ టికెట్ చార్జీలో సగానికే బాల, బాలికలు సీజన్ టికెట్ పొందవచ్చు.  అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న కార్మికులు అంటే కూరగాయల విక్రేతలు, ఇళ్లల్లో పనివారు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణరంగ కార్మికులకు మిగిలిన వారితో పోలిస్తే  100 కిలోమీటర్ల పరిధిలో చాలా తక్కువ ధరకే సీజన్ టికెట్లను రైల్వే అందిస్తోంది. 
వృద్ధులకు సముచిత గౌరవం
వృద్ధులకు అన్ని తరగతుల్లోనూ రైల్వే భారీ రాయితీలిస్తోంది. 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్ చార్జీల్లో 40 శాతం తగ్గింపు... 58 ఏళ్లు నిండిన మహిళలకు 50 శాతం తగ్గింపునిస్తోంది. అంతేకాదు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్త్ కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ వయసు ఎక్కువగా చూపించి రాయితీ పొందితే తనిఖీల సందర్భంగా పట్టుబడితే టికెట్ చార్జీల్లో తేడాను వసూలు చేయడంతోపాటు జరిమానా కూడా విధిస్తారు. 
విజ్ఞాన యాత్రలకూ తగ్గింపు
విద్యార్థులు విజ్ఞాన యాత్రలకు వెళుతుంటే ముందుగా రైల్వే అధికారులను సంప్రదించినట్టయితే సెకండ్ క్లాస్ లో 50 శాతం రాయితీ లభిస్తుంది. అదే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు అయితే ఈ రాయితీ 75 శాతం వరకు అందుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏడాదికోసారి స్టడీ టూర్ ఏర్పాటు చేసుకుని సెకండ్ క్లాస్ టికెట్ చార్జీల్లో 75 శాతం రాయితీ పొందవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ప్రవేశ పరీక్షల కోసం వెళుతున్నట్టయితే టికెట్ చార్జీలో 75 శాతం రాయితీ అందుకోవచ్చు. ఇక యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు రాస్తున్న వారు 50 శాతం తగ్గింపు ధరకే టికెట్లు పొందవచ్చు. రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనల కోసం వెళుతున్నట్టయితే వారు కూడా 50 శాతం తగ్గింపు అందుకోవచ్చు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళుతున్న వారికి 50 నుంచి 100 శాతం రాయితీ ఉంది. 
వికలాంగులకు  
శారీరక వైకల్యంతోపాటు, మానసిక వైకల్యం ఉన్న వారికి రైల్వే శాఖ సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, 3ఏసీ, ఏసీ చైర్ కార్ లలో 75 శాతం వరకు రాయితీ కల్పిస్తోంది.1ఏసీ, 2ఏసీలో 50 శాతం రాయితీనిస్తోంది. వెంట ఉన్న ఓ సహాయకుడికి కూడా టికెట్ చార్జీలో ఇంతే మొత్తం రాయితీ లభిస్తుంది. అదే చెవిటి, మూగ వర్గాల వారు సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్ క్లాస్ లలో 50 శాతం రాయితీ అందుకోవచ్చు. వికలాంగులు డిస్కౌంట్ కోసం గాను ఐకార్డు తీసుకోవాలి. ఇందుకు గాను రైల్వే కౌంటర్ల వద్ద నిర్ణీత ఫామ్ పూర్తి చేసి వైకల్య ధ్రువీకరణ, ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రాణాంతక వ్యాధులున్నవారికి.... 
కేన్సర్ పేషెంట్లు తరచూ వైద్య చికిత్సలకు రైళ్లల్లో ప్రయాణిస్తుంటే తరగతులనుబట్టి 50 నుంచి 100 శాతం వరకు రాయితీ అందుకోవచ్చు. వెంట సాయంగా వచ్చే వారికి కూడా ఇదే వర్తిస్తుంది. తలసీమియా వ్యాధిగ్రస్తులకు, గుండె శస్త్రచికిత్సలకు, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు వెళుతున్నవారు, హీమోఫీలియా, టీబీ, లెప్రసీ, ఎయిడ్స్, అనీమియా, సికిల్ సెల్ అనీమియా పేషెంట్లకు కూడా 50 నుంచి 75 శాతం వరకు రాయితీ ఉంది. 
రాయితీల విషయంలో ఇంకా పూర్తి వివరాలకు ఈ లింక్ ను చూడగలరు.http://www.indianrail.gov.in/  http://www.indianrailways.gov.in/  అలాగే టికెట్ చార్జీల కోసం http://www.indianrail.gov.in/  ఈ లింక్ ఉపయోగపడుతుంది. 

ఏ సమస్యకు ఏ వైద్యుడు...?


సుమతికి అనుకోకుండా ఓ ఆరోగ్య సమస్య ఎదురైంది. వీలు చూసుకుని ఓ రోజు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లింది. పరీక్షించిన డాక్టర్ డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. అర్థం కాలేదన్నట్టు సుమతి సందేహంగా చూసింది. ఆమెను గమనించిన డాక్టర్ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లి చూపించుకోవాలని చెప్పి పంపించారు. 
ఒకప్పుడు సమస్య ఏదైనా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లేవారు. వారే దాదాపుగా అన్ని రకాల చికిత్సలూ అందించేవారు. సాధారణ వ్యాధులకు ఎంబీబీఎస్ లేదా ఎండీ డాక్టర్... శస్త్ర చికిత్సలు అయితే ఎంఎస్ డాక్టర్లు సేవలు అందించడమన్నది రెండు దశాబ్దాల క్రితం వరకు ఉన్న పరిస్థితి. వైద్య శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మానవ శరీరంలో ప్రతీ అవయవం ఓ ప్రత్యేక వైద్య విభాగంగా అవతరించింది. వైద్య విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్లు చేసి ఆ విభాగానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. ఆయా విభాగాలు ఏంటో చూద్దాం.. 
జనరల్ ఫిజీషియన్: వీరినే సాధారణ వైద్యులు, ఫ్యామిలీ డాక్టర్ అని అంటుంటారు. మందులతో నివారించదగిన సాధారణ వ్యాధులన్నింటికీ వీరు చికిత్సలు అందిస్తారు. అవసరం అనుకుంటే స్పెషలిస్ట్ డాక్టర్ ను వారే సూచిస్తారు. 
గైనకాలజిస్ట్: మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, గర్భధారణ, జననేంద్రియ సమస్యలకు చికిత్సల్లో వీరు నిపుణులు. 
ఆబ్సెట్రీషియన్: గైనకాలజీలోనే ఇదో ప్రత్యేక విభాగం. మహిళల పునరుత్పత్తి వ్యవస్థ అంటే సంతాన సాఫల్యత విభాగంలో వీరు స్పెషలిస్ట్.  
పెడియాట్రీషియన్: చిన్న పిల్లలకు ఎంతో శ్రద్ధ, జాగ్రత్తతో కూడిన వైద్యం అవసరం. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 16 ఏళ్ల వయసు వారికి వీరు వైద్య సేవలు అందిస్తుంటారు. 
నియోనాటాలజిస్ట్: రోజుల శిశువులు (నవజాత శిశువులు) ముందే పుట్టిన శిశువులకు కీలక వైద్య సేవలు అందించగల నిపుణులు. 
ఆప్తమాలజస్ట్: కంటి వైద్యులు.. కంటి సమస్యలకు వైద్యం చేయడంలో వీరు నిపుణులు. 
డెర్మటాలజిస్ట్: వీరినే చర్మ వైద్యులు అని కూడా అంటుంటారు. సాధారణంగా మిగతా అనారోగ్య సమస్యలకు, చర్మ వ్యాధులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఇలాంటి సమస్యలలో డెర్మటాలజిస్ట్ సేవలు తప్పనిసరి అవుతాయి. 
ఈఎన్టీ డాక్టర్: చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి వచ్చే సమస్యలకు వీరు చికిత్సలు అందిస్తుంటారు. తరచుగా ముక్కులు మూసుకుపోతుండడం, గొంతులో మంట, నొప్పి, ఆహారం మింగుడు పడకపోవడం, వినికిడి లోపాలు... ఇలా ఈ మూడు విభాగాలకు సంబంధించిన సమస్యలలో వీరు నిపుణులు. 
ఆర్థోపెడిక్: ఎముకలకు సంబంధించిన వ్యాధులు, సమస్యల వైద్యంలో వీరు నిష్ణాతులు. ఎముకలు, కీళ్ల శస్త్ర చికిత్సల నిపుణులను ఆర్థోపెడిక్ సర్జన్లుగా పేర్కొంటారు. 
రుమటాలజిస్ట్: కీళ్ల వ్యాధి నిపుణులు. కీళ్లలో వాపులు, నొప్పులు, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలకు వైద్య సేవలు అందిస్తారు. అలాగే రోగ నిరోధక వ్యవస్థ వైఫల్యం కారణంగా తలెత్తే రుమార్థరైటిస్ కు కూడా చికిత్స అందిస్తారు.   
ఇమ్యునోలజిస్ట్: రోగ నిరోధక వ్యవస్థ విఫలమైనా, బలహీన పడినా తద్వారా ఎదురయ్యే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు వీరు చికిత్సలు అందిస్తారు. 
యూరాలజిస్ట్: మూత్రాశయ వ్యాధులకు చికిత్సలు అందిస్తారు. అవసరమైతే శస్త్ర చికిత్స కూడా చేస్తారు. 
కార్డియాలజిస్ట్: అన్నింటిలోకి గుండె ఎంతో విలువైనది. గుండె సంబంధిత వ్యాధి నిపుణులుగా కార్డియాలజిస్టులను పేర్కొంటారు. 
కార్డియో వాస్క్యులర్ సర్జన్: గుండె సంబంధిత శస్త్ర చికిత్సల నిపుణులు. 
న్యూరో ఫిజీషియన్ : వెన్నుపాము, నాడీ మండలానికి సంబంధించిన వ్యాధులకు మందులు సూచిస్తారు. తలనొప్పి, మెడనొప్పి, వెన్నుపాము నొప్పి, జ్ఞాపక శక్తి లోపం, బీపీ, ఫిట్స్, మెదడులో ట్యూమర్లు తదితర సమస్యలు. ఈ విభాగానికి సంబంధించి శస్త్ర చికిత్స నిపుణులను న్యూరో సర్జన్లుగా పిలుస్తారు. 
డెంటిస్ట్: దంత వైద్య నిపుణులు. ఇందులోనూ మళ్లీ చాలా రకాల స్పెషలిస్టులు ఉంటారు. పళ్ల వరుస మార్చేందుకు, అందంగా తయారు చేసేందుకు, చిన్నారుల దంత సమస్యలకు వివిధ రకాల నిపుణులు ఉంటారు. 
సైకియాట్రిస్ట్: మానసిక పరమైన సమస్యలకు వీరు వైద్యం చేస్తారు. 
పేథాలజస్ట్: లేబొరేటరీ పరీక్షల ద్వారా వ్యాధులు నిర్ధారణ వీరి విధులు. 
రేడియాలజిస్ట్: యంత్రాల సాయంతో ఎక్స్ రేలు, స్కాన్ లు, ఎంఆర్ఐ తదితర పరీక్షలు నిర్వహించి సమస్యలు గుర్తించడం వీరి పని. కేన్సర్ రోగులకు రేడియాలజీ వైద్యసేవలు కూడా అందిస్తుంటారు. 
అనస్థీషియాలజస్ట్: శస్త్ర చికిత్స సమయాల్లో రోగులకు నొప్పి తెలియకుండా ఉండేందుకు వీరు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తుంటారు.  
జనరల్ సర్జన్: సాధారణ శస్త్ర చికిత్సల నిపుణులు. 
ప్లాస్టిక్ సర్జన్: చర్మమార్పిడి, శారీరక అవయవాల నిర్మాణ మార్పిడికి వీరు శస్త్రచికిత్సల సేవలు అందిస్తుంటారు. 
పల్మనాలజస్ట్: ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి వైద్య సేవలు అందించడం వీరి పని. వీరినే చెస్ట్ స్పెషలిస్టులు అని కూడా అంటారు. 
ఆంకాలజస్ట్: కేన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సల నిపుణులు. వీరిలో సర్జరీ చేసే వారిని సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు. 
నెఫ్రాలజిస్ట్: మూత్ర పిండాల వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు అందించే స్పెషలిస్ట్. 
ఎండ్రోక్రినాలజిస్ట్: గ్రంధులు, హార్మోన్ల సమస్యల నివారణలో వీరు నిష్ణాతులు. హార్మోన్లలో తేడాలు, థైరాయిడ్, మెనోపాజ్ (స్త్రీలలో రుతుచక్రం నిలిచిపోయే దశ), మధుమేహం, జీవక్రియల్లో తేడాలు, ఎదుగుదల లేకపోవడం తదితర సమస్యలకు వీరు వైద్య సేవలు అందిస్తుంటారు. 
హెమటాలజిస్ట్: మానవ శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం సరఫరా అవుతుంటుంది. అదే రక్తానికి ఏమైనా అయితే? అవును అలాంటప్పుడు హెమటాలజిస్ట్ సేవలు అవసరం అవుతాయి. హిమోఫిలియా (రక్తం గడ్డ కట్టని స్థితి), బ్లడ్ కేన్సర్, లింఫ్ గ్రంధుల కేన్సర్, సికిల్ సెల్ అనీమియా తదితర సమస్యలకు వీరు చికిత్స చేస్తారు. హెమటాలజీ అనేది ఇంటర్నల్ మెడిసిన్ లో ఓ విభాగం.
గ్యాస్ట్రాలజిస్ట్: జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎదురయ్యే వ్యాధులకు చికిత్సలు అందిస్తుంటారు. 
ఆండ్రాలజస్ట్: పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి వచ్చే సమస్యలకు వీరు తగిన నిపుణులు. సంతాన సామర్థ్యం లేకపోవడం తదితర సమస్యలకు చికిత్సలు చేస్తారు.  
ఆడియాలజిస్ట్: వినికిడి శక్తి లోపించిన వారికి తగిన మెషిన్ల సాయంతో వినగలిగేలా చేయడం వీరి పని. 
జెనెటిస్జ్: జన్యువులలో సమస్యలు ఉన్నవారికి జెనెటిస్ట్. 
ట్రైకాలజిస్ట్: జుట్టు రాలడం, పల్చబడడం, బ్రేకేజ్ తదితర సమస్యలకు ఈ నిపుణులను సిఫారసు చేస్తుంటారు. వీరు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలు కూడా అందిస్తుంటారు. ఇలా పలు విభాగాల్లోనూ మళ్లీ అంతర్లీనంగా మరికొన్ని స్పెషలైజేషన్లు ఉన్నాయి. అందుకే ఏదేనీ ఆరోగ్య సమస్య వదలకుండా వేధిస్తుంటే ముందుగా జనరల్ ఫిజీషియన్ అంటే ఎండీ వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. ఒకవేళ సంబంధిత సమస్యకు ప్రత్యేక వైద్యం అవసరం అనుకుంటే అప్పుడు వారే తగిన నిపుణుడిని సూచిస్తారు. 

ఆరోగ్య బీమా క్లెయింలో మతలబు ఏమిటి?


వంశీధర్ కు ఒక రోజు తల తిరుగుతూ ఉంటే హాస్పిటల్ కు వెళ్లాడు. వాళ్లేమో ఆ పరీక్షలు, ఈ పరీక్షలు అంటూ అతడ్ని ఆస్పత్రిలో చేర్పించుకుని మూడు రోజుల పాటు ఉంచారు. ఈ మూడు రోజుల్లో వంశీధర్ ఎలాంటి ఆందోళన చెందలేదు. 'ఆరోగ్య బీమా ఉంది కదా, ఏటా 23వేల రూపాయల ప్రీమియం చెల్లిస్తున్నాను, ఏం కాదులే' అంటూ నిశ్చింతగా ఉన్నాడు. కానీ క్లెయిమ్ విషయంలో బీమా కంపెనీ స్పందన చూసి కంగుతిన్నాడు. 42 వేల రూపాయల బిల్లును స్వయంగా చెల్లించి ఉసూరుమంటూ వెనుదిరిగాడు. ఈ మూడు రోజులపాటు ఆస్పత్రిలో తీసుకున్న వైద్యం నగదు రహిత చికిత్సల పరిధిలోకి రాదని బీమా కంపెనీ తరఫున టీపీఏ నుంచి సమాధానం వచ్చింది. అయితే, ఈ స్పందన వంశీధర్ కు ఏ మాత్రం సహేతుకుంగా అనిపించలేదు.
పట్టి పట్టి చూడండి 
ఆరోగ్య బీమా పాలసీ తీసేసుకున్నాం కదా? అని అనుకుంటే చాలదు. అందులో ఉన్న మినహాయింపులు, క్లెయిమ్ విషయంలో, చికిత్సా వ్యయాల్లో ఉన్న పరిమితుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. దానివల్ల క్లెయిమ్ ల విషయంలో కనీస ప్రాథమిక అవగాహన ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు ఉన్న వ్యాధులకు కూడా కవరేజీ ఉంటుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. అప్పటి వరకు ఉన్న వ్యాధుల సమాచారాన్ని తెలియజేసి వాటికి కూడా కవరేజీ కోరవచ్చు. సాధారణంగా అప్పటి వరకు ఉన్న వ్యాధులకు వెంటనే కాకుండా ఏడాది తర్వాత లేదంటే మూడు నాలుగేళ్ల తర్వాత నుంచి కవరేజీ వర్తిస్తుందని కంపెనీలు నిబంధన విధిస్తాయి. ఆ గడువు తర్వాత నుంచి ముందస్తు వ్యాధులకు కూడా నిశ్చింతగా కవరేజీ పొందవచ్చు. ఈ వేచి ఉండే కాలం అనేది వ్యాధులను బట్టి మారుతుంది. అందుకే పాలసీ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి. ఒకవేళ ముందస్తు వ్యాధుల సమాచారాన్ని తెలియజేయకుంటే.. సమాచారాన్ని కప్పిపెట్టారంటూ క్లెయిమ్ లను కంపెనీలు తిరసర్కించే ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు వ్యాధులు, అనారోగ్యం ఇతరత్రా సమాచారాన్ని విధిగా తెలియచేయడం బాధ్యత. 
నిబంధనలు నచ్చకపోతే వదిలించుకోండి
ఫ్రీలుక్ పీరియడ్ అంటూ పాలసీ జారీ తర్వాత బీమా కంపెనీలు కనీసం 15 రోజుల గడువు ఇస్తున్నాయి. పాలసీ పత్రాన్ని సమగ్రంగా చదివి సందేహలు ఉంటే కంపెనీని సంప్రదించాలి. సంతృప్తికరమైన సమాధానం రాకుంటే, పాలసీ పత్రంలోని నిబంధనల పట్ల అయిష్టంగా ఉంటే రద్దు కోరవచ్చు. కట్టిన ప్రీమియంలో కొంత మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తాయి. పాలసీ ప్రపోజల్ పత్రాలను స్వయంగా పూరించడం వల్ల చిదంబర రహస్యాలు తెలుస్తాయి. 
పరిమితులూ ఉన్నాయి
చికిత్సా వ్యయాల్లో పరిమితులు కూడా ఉంటాయి. ఆస్పత్రిలో రూమ్ చార్జీలు, ఐసీయూ చార్జీలు తదితర విషయాల్లో రోజుకు ఇంత మేరకే చెల్లిస్తామని సబ్ లిమిట్స్ ఉంటాయి. ఆస్పత్రిలో కనీసం ఒక రోజు పాటు ఉంటేనే క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పాలసీలు డే కేర్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. అంటే ఆస్పత్రిలో చేరకపోయినా, వైద్య పరీక్షలు, చికిత్సలకు అయ్యే మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.
ఆస్పత్రిలో చేరిన వెంటనే
ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించాలి. అన్ని ముఖ్యమైన ఆస్పత్రుల్లో బీమా విభాగం ఉంటుంది. వారి ద్వారా సమాచారాన్ని తెలియజేయవచ్చు. ఆస్పత్రిలో చేరిన 48 గంటల తర్వాత తెలియజేయడం వల్ల క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. ప్రణాళిక ప్రకారం ఏదేనా చికిత్స కోసం ఫలానా రోజు ఆస్పత్రిలో చేరదామని నిర్ణయించుకుంటే చేరే ముందే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించి ఆమోదం తీసుకోవడం ఉత్తమం. 
ఇలా అయితే తిరస్కరణే!
క్లెయిమ్ పత్రాలు సరిగా లేకుంటే కంపెనీలు నిర్మొహమాటంగా తిరస్కరిస్తాయి. ఎక్స్ రే, సోనోగ్రఫీ తదితర పరీక్షలకు డాక్టర్ ఆమోదం లేకుంటే వాటికి సంబంధించిన చెల్లింపులను నిలిపివేస్తాయి. ఆస్పత్రుల నుంచి పంపే క్లెయిమ్స్ పత్రాల్లో వివరాల నమోదులో తప్పిదం జరిగినా తిరస్కరణకు గురికావచ్చు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారం రోజుల్లోగా క్లెయిమ్ పత్రాలను కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. డిశ్చార్జ్ అనంతరం ఖర్చులకు కూడా బీమా క్లెయిమ్ చేసుకునేట్లయితే 60 రోజుల్లోగా బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
మోటారు, హెల్త్ ఇన్సూరెన్సుల్లో తిరస్కరణలు ఎక్కువగా ఉంటుంటాయి. ‘ప్రొసీజర్ వజ్ నాట్ మెడికల్లీ నెసెస్సరీ’ అంటూ వైద్య బీమా కంపెనీలు తిరస్కరిస్తుంటాయి. సాధారణంగా ప్రైవేటు ఆస్పత్రులు రోగి నుంచి ఎక్కువ రాబట్టుకోవాలని అవసరం లేని పరీక్షలు కూడా చేస్తుంటాయి. అలాంటి అడ్డగోలు ఖర్చులకు బీమా కంపెనీలు చెల్లింపులు చేయవు. 
తీసుకున్న చికిత్స పాలసీ పరిధిలో లేకుంటే, క్లెయిమ్ ఫామ్ సరిగా పూర్తి చేయకుంటే, అవసరం లేని చికిత్సలను ఆస్పత్రుల్లో చేసినట్టయితే, సరైన సమయంలోపు క్లెయిమ్ కు దరఖాస్తు చేసుకోకుంటే తిరస్కరణకు గురికావచ్చు. అయితే, తిరస్కరణకు గల కారణాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ లేదా కంపెనీ తరఫున టీపీఏ తెలియజేస్తుంది. ఈ కారణం సహేతుకంగా లేదని భావిస్తే, తగిన అర్హత ఉందని భావిస్తే మీరు మరోసారి కంపెనీని సంప్రదించవచ్చు. జీవిత బీమానే కాదు... ఏ బీమా పాలసీ అయినా మనుగడ లేకుంటే బీమా వర్తించదు. కనుక నిర్ణీత గడువులోపు ప్రీమియం చెల్లించి పాలసీ ల్యాప్స్ కాకుండా చూసుకోవాలి. 
తిరస్కరణకు గురైతే...
క్లెయిమ్ పత్రాన్ని మరోసారి సమగ్రంగా పరిశీలించండి. పేరు, పాలసీ నంబర్, ఇతర సమాచారం సరిగ్గా ఉన్నాయా? లేదా? సరి చూసుకోవాలి. ఏదైనా తప్పిదం, పొరపాటును గుర్తిస్తే సరిచేసి మళ్లీ మీ క్లెయిమ్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని టీపీఏను కోరాలి. అలాగే, పాలసీ క్లెయిమ్ పత్రంతోపాటు జతపరిచిన మిగిలిన వాటిని కూడా సమగ్రంగా పరిశీలించి ఏవైనా మిస్ అయితే వాటిని జతచేయాలి. వైద్యపరంగా అనవసరంగా చికిత్స చేశారన్న కారణంతో క్లెయిమ్ తిరస్కరణకు గురైతే... వైద్య సలహా తీసుకోండి. అర్హత ఉంటే సరైన సమగ్ర వివరాలతో తిరిగి మరోసారి దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి తిరస్కరించినప్పటికీ తిరిగి మళ్లీ దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్య బీమా కంపెనీ స్పందన సరిగా లేకుంటే, లేదా 30 రోజుల్లోపు క్లెయిమ్ కు సంబంధించి ఎలాంటి స్పందన లేకుంటే... తదుపరి 30 రోజుల్లోపు హెల్త్ ఇన్సూరెన్స్ అంబుడ్స్ మెన్ ను ఆశ్రయించి లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేయడం ద్వారా తగిన న్యాయం పొందవచ్చు. 

అవసరానికి 'లోన్' పొందడం ఎలా?


అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా, గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా... అన్న గేయం ఎంత ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాటలో చెప్పినట్టు అందరూ పప్పు కూడు కోసమే అప్పు చెయ్యరు. కొంత మందికి అవసరం. కొంత మందికి ఆకలి బాధ. అప్పు లేనిదే పూట గడవని వారు ఎందరో ఉన్నారు. మరి అవసరంలో ఆదుకునే రుణాలు ఏమున్నాయి...?. ఒక్కసారి అన్నింటినీ తెలిసేసుకుంటే అవసరంలో అప్పు పుట్టించడం తేలికవుతుంది!  
రుణాలు
వ్యక్తిగత రుణాలు, ఆస్తులపై రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్, క్రెడిట్ కార్డ్, బంగారంపై రుణాలు, వినియోగదారుల రుణాలు, పెన్షన్ పై రుణాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పై రుణాలు ఇలా అవసరంలో అక్కరకు వచ్చే రుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ రుణాలన్నీ కూడా వ్యక్తిగత ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగించుకోతగినవే. అదే గృహరుణం, విద్యా రుణాలు, వ్యవసాయ రుణాల వంటి వాటిని ప్రత్యేకంగా ఆయా అవసరాలకు మాత్రమే వినియోగించుకోతగిన రుణాలు.  
పర్సనల్ లోన్... వాస్తవాలు
అవసరం ఏదైనా గానీ అర్హత ఉంటే వ్యక్తిగత రుణం వెంటనే లభిస్తుంది. ఈ రుణం కోసం చాంతాండంత ప్రక్రియ ఉండదు. వేతన జీవులు లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారు తగిన ధ్రువీకరణ పత్రాలను ఇవ్వడం ద్వారా రుణాన్ని సంపాదించవచ్చు. నికరంగా వచ్చే నెలవారీ ఆదాయంలో 40 శాతాన్ని పరిగణనలోకి తీసుకుని రుణాన్ని ఖరారు చేస్తారు. రూ.50వేల నుంచి రూ.15 లక్షల వరకు అర్హతను బట్టి రుణం పొందవచ్చు. వ్యక్తిగత రుణాల కాల వ్యవధి ఏడాది నుంచి ఐదేళ్లలోపే ఉంటుంది. వడ్డీ ఎంతుంటుందన్న విషయాన్ని ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. రుణం తిరిగి చెల్లించే సత్తా, వేతన స్థాయి, రుణ చరిత్ర ఇలాంటి విషయాలను కంపెనీలు, బ్యాంకులు చూస్తాయి. 13 శాతం నుంచి 32 శాత వరకు వడ్డీ విధించవచ్చు. అర్హత సరిపోకపోతే మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా రుణం పొందవచ్చు. వ్యక్తిగత రుణాల్లో దరఖాస్తుదారుల అర్హతకు అనుగుణంగా ప్రాసెసింగ్ చార్జీలను బ్యాంకులు విధిస్తున్నాయి.  
రుణం జారీ చేసే ముందు...
ఏ కంపెనీ అయినా ప్రస్తుతం రుణాలు ఇచ్చే ముందు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్) రిపోర్టు చూస్తున్నాయి. ఇందులో ఓ వ్యక్తికి సంబంధించి అప్పటి వరకు తీసుకున్న అన్ని రుణాల వివరాలు ఉంటాయి. రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైనా అది సిబిల్ రికార్డుల్లోకి చేరిపోతుంది. దీని వల్ల ఒక వేళ రుణం లభించినా వడ్డీ రేటు పెరిగిపోతుంది. రుణం తీర్చే గడువు నాలుగేళ్లు. కానీ మూడేళ్లకే మొత్తం తీర్చేస్తే కొంత జరిమానా భరించాల్సి ఉంటుంది. ఇది మిగిలి ఉన్న బకాయిలో 5 శాతం మేర ఉండవచ్చు. ఇది కూడా చూడాల్సిన అంశమే.  
భిన్న రకాల వడ్డీ
స్థిర వడ్డీ, చర వడ్డీ ఉంటుంది. అలాగే, ఫిక్స్ డ్ ఫ్లాట్ రేట్, రెడ్యూసింగ్ బ్యాలన్స్ రేటు అని కూడా ఉంటాయి. ఫిక్స్ డ్ ఫ్లాట్ రేటు విధానంలో నెల నెల వాయిదాలు చెల్లిస్తున్నా గడువు తీరే వరకు రుణం మొత్తం అలానే ఉంటుంది. రెడ్యూసింగ్ బ్యాలన్స్ రేటు విధానంలో రోజువారీ, నెలవారీ, మూడు నెలలకోసారి, లేదా వార్షికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణం మొత్తం గడువు తీరే లోపు అసలు, వడ్డీ కలిపి మొత్తం ఎంత వ్యయం అవుతుందో ముందుగానే అడిగి తెలుసుకోవాలి. తక్కువ వ్యయం అయ్యే రుణమే నయం. అలాగే, నిబంధనలు, షరతులు చూడాలి. 
పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 
* ఐసీఐసీఐ బ్యాంకు 13.49% - 17.50% వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు కింద  0.5 - 2.25% వరకు చార్జ్ చేస్తోంది. ముందస్తు రుణం చెల్లింపులపై 5 శాతం జరిమానాగా చెల్లించుకోవాలి.
* హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 12.74% - 19.50% వడ్డీ రేటు ఉంది. ప్రాసెసింగ్ చార్జీ 1.75 - 2.25% ఉంది. రుణం పది లక్షల రూపాయలు దాటి ఉంటే ముందస్తు చెల్లింపు చార్జీల్లేవు. లేకుంటే 4 శాతం వసూలు చేస్తోంది.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12.60% - 1510% వడ్డీను వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు  1.01% శాతమే. ముందస్తు చెల్లింపు చార్జీల్లేవు. 
* యాక్సిస్ బ్యాంకులోనూ వడ్డీ రేటు 15% - 20% శాతంగా ఉంది. ప్రాసెసింగ్ చార్జీ కింద 2 శాతం చెల్లించుకోవాలి. ముందస్తు చెల్లింపు చార్జీల్లేవు. 
* బజాజ్ ఫిన్ సర్వ్ వడ్డీ రేట్లు 15 నుంచి 17% శాతం మధ్య ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజు 2 శాతం వరకు ఉంది. ముందస్తు రుణం తీర్చివేతపై 4 శాతం రాబడుతోంది. 
క్రెడిట్ కార్డుపై రుణం
ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తూ నెలకు 25వేల రూపాయలు అంతకంటే ఎక్కువ వేతనం తీసుకుంటున్నవారికి బ్యాంకులు ఇతర సంస్థలు పిలిచి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. అయితే, 1.50 లక్షల నుంచి 1.80 లక్షల్లోపు వేతనం ఉన్నవారికి కూడా ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులను సంస్థలు జారీ చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ విజయా బ్యాంకు అయితే రూ.60వేల వేతనం ఉన్నవారికి కూడా క్రెడిట్ కార్డు అందిస్తోంది. లేదంటే కనీసం 25వేల రూపాయల నుంచి 50వేల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ తర్వాత క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే కార్డు తప్పకుండా జారీ అవుతుంది.
క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు తమ పే స్లిప్, బ్యాంకు స్టేట్ మెంట్, నివాస, గుర్తింపు ధ్రువీకరణలు, పాన్ కార్డు కాపీని అందజేయాల్సి ఉంటుంది. స్వయం ఉపాధి, వృత్తుల్లో ఉన్నవారు ఆదాయపన్ను రిటర్నుల కాపీలను లేదా చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు సాధారణంగా నెలకు 1.5 నుంచి 2.99 శాతం వరకు ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంకు, సిటీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.50 శాతం స్థాయిలో వడ్డీని చార్జ్ చేస్తున్నాయి. సకాలంలో చెల్లించకపోతే వడ్డీలపై వడ్డీ పడుతుంది.  
బంగారంపై రుణం
బంగారు ఆభరణాలు ఇంట్లో బీరువాలో ఉంటే పిల్లలు పెడతాయా...? తీసుకెళ్లి దాన్ని కుదువపెట్టి చక్కగా రుణాన్ని పొందవచ్చు. అవసరాలను కూడా తీర్చుకోవచ్చు. సాధారణంగా పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డుపై రుణాలు సంస్థలకు సురక్షితమైనవి కావు. వీటిలో రిస్క్ ఉంటుంది. ఆభరణాలు, లేదా స్వచ్ఛ బంగారాన్ని తాకట్టు పెట్టుకుని ఇచ్చే రుణాలు సురక్షితమైనవి. తీసుకున్న రుణాన్ని తిరిగి తీర్చకుండా ఉండే అవకాశాలు తక్కువ. ఒకవేళ చెల్లించకున్నా బంగారాన్ని వేలం వేసుకుంటాయి. 
బంగారంపై రుణం గంటల్లో మహా అయితే ఒకటి రెండు రోజుల్లో లభిస్తుంది. బంగారం విలువపై 75 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు. నెలనెలా వడ్డీ చెల్లించవచ్చు. లేదంటే కాల వ్యవధి చివర్లో వడ్డీ, అసలు మొత్తాన్ని చెల్లించే సదుపాయం ఉంది. అయితే, వడ్డీ రేటు ఎంతుంటుంది అన్నది పలు రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రూపాయి కంటే తక్కువ వడ్డీకి ఏ సంస్థా రుణాన్ని ఇవ్వడం లేదు. వాస్తవంగా చూస్తే వడ్డీ రేటు రూపాయి నుంచి రెండు రూపాయల వరకు ఉంటోంది . 
10 లక్షల రూపాయల బంగారు ఆభరణాలను తనఖా పెడితే ఏడున్నర లక్షల రూపాయల వరకు రుణం లభిస్తుంది. కానీ, మీరు ఐదు లక్షల రూపాయలే తీసుకున్నారని అనుకుంటే అప్పుడు మార్జిన్ పరంగా మీపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఒకవేళ బంగారం విలువ తగ్గి తనఖా పెట్టిన బంగారం విలువ ఏడు లక్షల రూపాయలకు దిగిపోతే అప్పుడు రుణం తీసుకున్న వారు హామీగా అదనంగా రూ.50వేల బంగారాన్ని హామీగా ఉంచాలి. లేదా నగదు చెల్లించాలి. అందుకే రుణం వెసులుబాటును పూర్తిగా వినియోగించుకోకుండా కొంత తక్కువే తీసుకున్నట్టయితే ఆటు పోట్ల సమయంలో నిశ్చింతగా ఉండవచ్చు. ఇలా అర్హత కంటే తక్కువ రుణం తీసుకునే వారికి తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే సంస్థలు ఉన్నాయి.  
18 నుంచి 24 క్యారట్ల బంగారాన్ని తనఖా పెట్టుకోవచ్చు. స్టోన్స్ ఇతరత్రా ఉంటే వాటిని మొత్తం బరువులోంచి తగ్గిస్తారు. సాధారణంగా బంగారం రుణాన్ని పొందడానికి పాన్ కార్డు, వోటర్ ఐడీ లేదా పాస్ పోర్టు వంటి ఏదో ఒక పత్రం ఇస్తే సరిపోతుంది. చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాలి. కొన్ని సంస్థలు ఇంటి ఇల్లాలి నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని కూడా అడుగుతున్నాయి. రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు కూడా అవసరం. 
వెయ్యి నుంచి కోటి రూపాయల వరకు రుణాన్ని తీసుకోవచ్చు. వడ్డీ రేటును రోజువారీ బ్యాలన్స్ పై విధిస్తుంటాయి. మధ్య మధ్యలో అసలుకు కొంత మొత్తం అదనంగా కట్టేందుకు అనుమతిస్తున్నాయి. సమయానికి వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే 2 శాతం వరకు జరిమానా చెల్లించుకోవాలి. రుణం జారీ సమయంలో ప్రాసెసింగ్ చార్జీ 2శాతం వరకూ ఉంటుంది. బంగారంపై రుణం సమయంలో విలువ మదింపు చార్జీ పేరుతో కొంత చెల్లించుకోవాలి. రుణాన్ని చెల్లించడంలో విఫలమైతే సంస్థలు ఒకటికి మూడు సార్లు నోటీసులు జారీ చేస్తాయి. అప్పటికీ స్పందించకుంటే తనఖాగా ఉన్న బంగారాన్ని వేలం వేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. 
బంగారం భౌతిక రూపంలోనే ఉండాలని లేదు. ఎలక్ట్రానిక్ రూపంలో... అంటే గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్) పైనా రుణాన్ని సులభంగా పొందవచ్చు. రుణం చెల్లింపు కాల వ్యవధి సాధారణంగా ఏడాది ఉంటుంది. కొన్ని సంస్థలు మూడు నెలలుగానే నిర్దేశించి ఆ గడువు తర్వాత పునరుద్ధరించుకుంటూ వెళుతున్నాయి. 
బంగారంపై తాకట్టు, నెలవారీ వాయిదాలు చెల్లించడం అసౌకర్యంగా భావించే వారు ఆభరణాలను మార్కెట్లో విక్రయించి వచ్చిన డబ్బులతో అవసరాలను తీర్చుకోవచ్చు. రుణం తీసుకుంటే నెలవారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది కదా. ఆభరణాలు విక్రయించినట్టయితే నెలనెలా కొంత మొత్తంతో తిరిగి బంగారం కొనుగోలు చేస్తూ వెళితే అమ్మేసిన మొత్తాన్ని తిరిగి కొంత కాలంలోనే సొంతం చేసుకోవచ్చు.  
ఇన్సూరెన్స్ పాలసీలపై రుణాలు
ఇన్సూరెన్స్ అన్నది అనుకోని సంఘటనే జరిగితే తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఆదుకునేది. కానీ, అత్యవసరంగా నగదు అవసరం అయితే ఇన్సూరెన్స్ పాలసీ పత్రాన్ని హామీగా ఉంచి రుణాన్ని పొందవచ్చు. బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీ సంస్థలు సైతం బీమా పత్రాలను తనఖా పెట్టుకుని రుణాలు ఇస్తున్నాయి. అయితే, సంప్రదాయ ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలపైనే రుణం లభిస్తుందని మర్చిపోవద్దు. అది కూడా పాలసీ జారీ చేసిన మూడేళ్ల తర్వాతే. మూడేళ్లు పూర్తి అయిన పాలసీలకే సరెండర్ వేల్యూ (స్వాధీన విలువ) వస్తుంది. ఆ విలువపైనే ఎంత రుణం ఇవ్వాలనేది సంస్థలు నిర్ణయిస్తాయి. స్వాధీన విలువలో 90 శాతం వరకు రుణం లభిస్తుంది. 
గోల్డ్ లోన్ వలే బీమా పత్రాలపై రుణం కూడా సులభంగానే పొందవచ్చు. సెక్యూర్డ్ రుణాలు కనుక తిరస్కరించే అవకాశాలు చాలా చాలా తక్కువ. హామీగా బీమా పాలసీ పత్రం ఉంటుంది కనుక పెద్ద ప్రహసనం ఏమీ ఉండదు. ఫొటో ఐడెంటిటీ, చిరునామా గుర్తింపు పత్రాలు, ఫొటో కాపీలు అందజేస్తే సరిపోతుంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 12.50 నుంచి 19.50 శాతం వరకు వడ్డీ రేటు వసూలు చేస్తోంది. ప్రాసెసింగ్ ఫీజును 2.5 శాతం విధిస్తోంది. గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తోంది. కాల వ్యవధి ఏడాది నుంచి ఐదు సంవత్సరాలు.
టాటా క్యాపిటల్ సంస్థ కూడా 12.50 శాతం నుంచి 19.50 వడ్డీ రేటును, 2.5 శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు 11.49 నుంచి 17.50 శాతం వడ్డీ రేటును, 2.5 శాతం ప్రాసెసింగ్ ఫీజును తీసుకుంటోంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ అయితే 15.75 శాతం వరకు వడ్డీ రేటు, ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. ఎస్ బీఐ 17.65 శాతం వడ్డీ, ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటోంది. కాల వ్యవధి అనేది దాదాపుగా అన్ని కంపెనీల్లోనూ ఏడాది నుంచి ఐదేళ్ల వరకే ఉంది. 
ఎల్ఐసీ మాత్రం తన పాలసీదారులకు పాలసీ పత్రాలపై 10 శాతం వడ్డీ రేటుకే రుణాలను అందిస్తోంది. వడ్డీ కూడా ఆరు నెలలకు ఓ సారి చెల్లిస్తే సరిపోతుంది. అసలు రుణాన్ని పాలసీ కాల వ్యవధి తీరే వరకు కొనసాగించుకునే సదుపాయం ఉంది. చివరిగా సెటిల్ మెంట్ అప్పుడు రుణాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. అందుకే పాలసీలపై రుణం కోసం బీమా కంపెనీలను ఆశ్రయించడం వల్ల తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది.
బ్యాంకు లేదా ఎన్ బీఎఫ్ సీ సంస్థ లేదా బీమా కంపెనీ నుంచి రుణాలను పొందేందుకు ముందుగా ఆయా సంస్థలను సంప్రదించాలి. దరఖాస్తును ఇవ్వడంతోపాటు పాలసీ పత్రాన్ని తనఖా పెడుతున్నట్టు రాసి ఇవ్వాలి. రుణ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు దాదాపుగా ఉండవు. రుణ చరిత్ర ఇతర గోల కూడా ఉండదు. సులభంగా రుణం లభిస్తుంది. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికి పాలసీలపై రుణం మంచి ఐడియాగా చెబుతారు.
విఫలమైతే...
బీమా పాలసీలపై తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఓ వ్యక్తి విఫలమయ్యాడని అనుకుందాం. ఓ రోజు ప్రమాదవశాత్తూ పాలసీదారుడు మరణించినట్టయితే... అప్పుడు నామినీలు పాలసీదారుడు బతికున్న సమయంలో తీసుకున్న రుణం, వడ్డీని పూర్తిగా చెల్లించి పాలసీ పత్రాన్ని స్వాధీనం చేసుకుని ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. తీర్చలేకుంటే బీమా సంస్థ అందించే పరిహారంలో రుణం, వడ్డీలకు చెల్లింపులు పోను మిగిలిన మొత్తం నామినీకి అందుతుంది. అసలు రుణం, వడ్డీ బకాయిలు కలిపి పాలసీ స్వాధీన విలువకు చేరిన వెంటనే ఆ పాలసీ కథ ముగిసినట్టే. దాన్ని సరెండర్ చేయడం ద్వారా ఆ మొత్తాన్ని రుణం ఇచ్చిన సంస్థ మాఫీ చేసుకుంటుంది.
ఫిక్స్ డ్ డిపాజిట్లపై రుణం
రెండు మూడేళ్ల తర్వాత ఓ ముఖ్య అవసరం కోసమని కొంత నగదును ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఈ లోపు అత్యవసరం ఏర్పడింది. వెంటనే నగదు కావాలి. బంగారం కుదువపెడదామంటే ఆభరణాలే లేవాయె. స్నేహితులును, బంధువులను అడిగితే కాదన్నారు. ఇక మీకున్న ఒకే ఒక అవకాశం ఫిక్స్ డ్ డిపాజిట్. డిపాజిట్ రద్దు చేసి నగదు వెనక్కు తీసుకుంటే మళ్లీ పొదుపు చేయలేమో...? అన్న సందేహం. దీంతో డిపాజిట్ చేసిన బ్యాంకుకు వెళ్లి దానిపై రుణం తీసుకోవచ్చు. దీన్నే ఓడీ ఫెసిలిటీ అని కూడా అంటారు. హామీగా ఆ డిపాజిట్ పత్రాన్ని తమ దగ్గర ఉంచుకుని డిపాజిట్ విలువలో 80 శాతం నుంచి 90 శాతం వరకు బ్యాంకులు రుణం ఇస్తాయి. వడ్డీ కూడా చాలా తక్కువే. డిపాజిట్ పై బ్యాంకు ఇస్తున్న వడ్డీ రేటు కంటే రెండు శాతం అదనం.
ఉదాహరణకు డిపాజిట్ పై 7 శాతం వడ్డీ రేటు ఉంటే 9 శాతం వడ్డీకే రుణాన్ని తీసుకుని నింపాదిగా ఉండవచ్చు. పైగా డిపాజిట్ ను కదిలించకుండా ఉంటారు. దానిపై వచ్చే వడ్డీ రేటును చూసుకుంటే తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీ రేటు నికరంగా 2 శాతమే. దాదాపుగా చాలా బ్యాంకులు రుణం జారీకి ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయడం లేదు. రుణం కాల వ్యవధి డిపాజిట్ మెచ్యూరిటీ గడువు వరకు ఉంటుంది. వడ్డీ రోజువారీగా లెక్కిస్తారు కనుక ముందస్తు చెల్లింపులపై ఎలాంటి జరిమానాలు విధించడం లేదు. ఒక వేళ మీ దగ్గర డిపాజిట్ కూడా లేదనుకుందాం. అప్పుడు స్నేహితులు, బంధువుల దగ్గర కనీసం డిపాజిట్ పత్రం ఉంటే ఓడీ ద్వారా ఇవ్వమని కోరండి. బ్యాంకు వడ్డీ రేటు కంటే అదనంగా రెండు శాతం ఇస్తామని ఆఫర్ చేయండి.
ఆస్తులపై రుణాలు
ఇళ్లు, ఇతర ఆస్తులను తనఖా ఉంచి వాటిపై రుణం తీసుకునేందుకు బ్యాంకులు అవకాశం కల్పిస్తున్నాయి. మార్కెట్ విలువపై 50 శాతం వరకు రుణం వచ్చేందుకు అవకాశం ఉంది. కొన్ని 70 శాతం వరకూ రుణాలిస్తున్నాయి. లేదా రుణం తీసుకునే వారు నెలవారీ ఆర్జనకు 30 నుంచి 40 రెట్ల వరకు రుణం వస్తుంది. ఉదాహరణకు నెలకు 20వేల రూపాయలు అందుకుంటుంటే గరిష్ఠంగా రూ.8లక్షల వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రేటు 13 నుంచి 16 శాతంగా ఉంది. సాధారణంగా ముఖ్యమైన అవసరాలకే ఆస్తులపై రుణానికి వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తుంటారు.
ఈ రుణాలపై వడ్డీ స్థిరంగా లేదా చలనంగా ఉండవచ్చు. ప్రభుత్వ రంగ ఎస్ బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా వంటివి తక్కువ ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. పైగా ముందస్తు రుణం తీర్చివేతపై రుసుములు విధించడం లేదు. సాధారణంగా ప్రాపర్టీ రుణాలపై ప్రాసెసింగ్ చార్జీ 0.5 శాతం నుంచి 1.5 శాతం (రుణం విలువపై) వరకు ఉంది. ఏడాది నుంచి పదేళ్ల వరకు రుణం తీర్చేందుకు గడువు ఉంటుంది. తర్వాత మరో ఐదేళ్లు పొడిగించే అవకాశం కూడా ఉంది. వడ్డీ రేటు పరంగా చూస్తే వ్యక్తిగత రుణం కంటే ప్రాపర్టీపై రుణమే చౌక. పైగా వ్యక్తిగత రుణాల కాల వ్యవధి ఐదేళ్లు. ప్రాపర్టీ రుణాన్ని నిదానంగా అయినా తీర్చేయవచ్చు.
ఇల్లు, ఫ్లాట్, ప్లాట్, వాణిజ్య భవనం వీటిలో ఏదైనా సరే రుణానికి చెల్లుబాటు అవుతాయి. తీసుకునే వారి పేరుపైనే ఆస్తి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, ఆస్తి ఇద్దరు ముగ్గురు పేరిట ఉంటే అందరూ కలసి రుణానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆస్తులకు సంబంధించి సరైన డాక్యుమెంట్లు ఉండాలి. బ్యాంకులు నివాస, గుర్తింపు ధ్రువీకరణల కింద రేషన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా టెలిఫోన్ బిల్లు, పాన్ కార్డు అడగవచ్చు. వేతన జీవి అయితే గత ఆరు నెలల కాలానికి బ్యాంకు స్టేట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వయం ఉపాధిలో ఉన్నవారు గత రెండేళ్ల ఆదాయంపై చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి స్టేట్ మెంట్ తీసుకుని సమర్పించాలి. 
పీపీఎఫ్ ఈపీఎఫ్ పై కూడా రుణం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లపై కూడా రుణం తీసుకునే సౌకర్యం ఉంది. ప్లాట్ కొనుగోలు, వైద్య చికిత్స, విద్య, వివాహం, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు లేదా గృహరుణం తీర్చేందుకు, ఇల్లు నవీకరణ, ముందస్తు పదవీ విరమణ సందర్భాల్లోనే ఈఫీఎఫ్ పై రుణం తీసుకోగలరు. పీపీఎఫ్ పై ఇలాంటి పరిమితులు లేవు. మూడో ఏడాది నుంచి ఆరో ఏడాదిలోపు రుణం తీసుకోవచ్చు. ఉదాహరణకు పీపీఎఫ్ ఖాతాను 2011-12వ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తే... మూడో ఏడాది అయిన 2014-2015 నుంచి ఆరో ఏడాది అయిన 2017-2018 లోపు రుణం తీసుకునేందుకు అవకాశం ఉంది. రుణం తీసుకుంటున్న తేదీకి అంతకుముందు ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఉన్న బ్యాలన్స్ పై 25 శాతం రుణమే లభిస్తుంది. ఆరో ఏడాది తర్వాత రుణానికి అవకాశం లేదు.
ఎందుకంటే పీపీఎఫ్ ప్రారంభించి ఆరేళ్లు పూర్తయితే నేరుగా కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. నాలుగో ఏడాది చివరికి ఖాతాలో ఉన్న నగదు బ్యాలన్స్ పై 50 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. పీపీఎఫ్ పై రుణాన్ని ఏక మొత్తంలో లేదా 36 నెలల కాలంలో నెలవారీగా తీర్చివేయవచ్చు. పీపీఎఫ్ పై ప్రభుత్వం చెల్లించే వడ్డీ రేటుకు అదనంగా రెండు శాతం వడ్డీ చెల్లిస్తే చాలు. 36 నెలల్లోపు రుణం తీర్చివేయకపోతే అదనంగా ఆరు శాతం వడ్డీ రేటు విధింపు ఉంటుంది. దీన్ని ఏటా పీపీఎఫ్ ఖాతా బ్యాలన్స్ నుంచి మినహాయించుకుంటారు. ఒకసారి రుణం తీసుకుని చెల్లించేస్తే తిరిగి మళ్లీ తీసుకోవచ్చు. 
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పై రుణాలు
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి అమ్మేద్దామంటే మార్కెట్లు బలహీనంగా ఉన్నాయా...? ఏం పర్వాలేదు. వీటిపై కూడా రుణం తీసుకోవచ్చు. కాకపోతే విలువ మొత్తంపై రుణం 50 శాతానికి మించదు. దీన్నే మార్జిన్ లేదా హెయిర్ కట్ అంటారు. పైగా అన్ని షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై రుణం ఇవ్వరు. ఎంపిక చేసిన జాబితాలోని షేర్లు, ఫండ్స్ పైనే రుణం లభిస్తుంది.
ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖంగా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు అయితే 10 నుంచి 12 శాతం వడ్డీయే వసూలు చేస్తోంది. ప్రభుత్వ రంగ ఎస్ బీఐ అయితే, ఇంకా తక్కువ వడ్డీకే ఇస్తోంది. రుణం తీర్చివేసే వరకూ వాటిని విక్రయించుకునే వీలుండదు.
వేతన ఖాతా నుంచి ఓవర్ డ్రాఫ్ట్
సేవింగ్స్ ఖాతాల నుంచి బ్యాలన్స్ కంటే అధిక మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఉద్యోగస్తులు తమ వేతన ఖాతా నుంచి ఓ నెల వేతనాన్ని అత్యవసరాల్లో డ్రా చేసుకునే సౌకర్యాన్ని పలు బ్యాంకులు తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచి రూ.10వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. వడ్డీ రేటు 12 శాతం నుంచి 20 శాతం మధ్య ఉంటుుంది. 
వడ్డీ వ్యాపారులే దిక్కు...!
ఇక ఎక్కడా రుణం పుట్టకపోతే చివరిగా అధిక వడ్డీలు వసూలు చేసే వ్యక్తుల దగ్గర నుంచి సాయం పొందడమే. వీరు 2 నుంచి 5 రూపాయల వడ్డీ వరకు వసూలు చేస్తుంటారు. ఇంతకంటే ఎక్కువ పిండుకునే వారు కూడా ఉన్నారు. 

హోమ్ లోన్ కావాలంటే

హోమ్ లోన్ కావాలంటే వీటిపై లుక్కేయాల్సిందే!

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. దాన్ని సాకారం చేసుకోవాలంటే అవసరమైనంత నగదు చేతిలో రెడీగా ఉండాల్సిన పనిలేదు. బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీ సంస్థలను ఆశ్రయిస్తే చాలు సులభంగానే రుణాలిస్తున్నాయి. కొత్త ఇంటికే కాదు, పాత ఇంటికి, నిర్మాణంలో మార్పులకు, పాత ఇంటికి మెరుగులు దిద్దడం, ఇలా ఎన్నో రుణాలున్నాయి. 
హోమ్ పర్చేజ్ లోన్స్
కొత్తగా నిర్మించిన ఇల్లు లేదా పాత ఇల్లు కొనుగోలుకు అవసరమైన రుణాన్ని హోమ్ పర్చేజ్ లోన్స్ అంటారు. కేవలం ఇల్లే కాదు, ఫ్లాట్ కొనుగోలు కూడా దీని కిందకే వస్తుంది. కొనుగోలు సమయంలో మార్కెట్ ధర ఎంతుందో అందులో 85 శాతం విలువ మేర రుణాన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ప్రతి ఒక్కరికీ ఇంతమేర రుణం వస్తుందనుకోవడం పొరపాటు. వ్యక్తిగత అర్హత, ఆదాయాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.
హోమ్ కన్ స్ట్రక్షన్ లోన్స్
అప్పటికే ప్లాట్ (స్థలం) కలిగి ఉండి అందులో ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారి కోసం ఈ రుణాలు. రుణం కోరుకునేవారు తగిన ఎస్టిమేషన్ వేయించుకుని బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలం కొని ఏడాదికి మించకుండా ఉంటే దాని విలువ కూడా నిర్మాణ వ్యయంలో కలిపి అంచనాగా సమర్పించవచ్చు.
హోమ్ ఎక్స్ టెన్షన్ / ఎక్స్ పాన్షన్ లోన్స్ 
ప్రస్తుతమున్న ఇంటి నిర్మాణ రూపు రేఖలు మార్చుకోవడానికి, అదనంగా గదులు నిర్మించడానికి, మరో ఫ్లోర్ వేసేందుకు ఈ లోన్స్ అక్కరకు వస్తాయి.
హోమ్ ఇంప్రూవ్ మెంట్ లోన్స్
ఇంటి ఆధునికీకరణ, మరమ్మతు పనులకు ఇచ్చే రుణాలను హోమ్ ఇంప్రూవ్ మెంట్ లోన్స్ గా పేర్కొంటారు. రంగులు వేయడం, ఎలక్ట్రికల్ వర్క్, వాటర్ ప్రూఫ్ పనులు, ఇంటిపై నీటి ట్యాంకు నిర్మాణం ఇలాంటివన్నీ వీటి పరిధిలోకి వస్తాయి.
హోమ్ కన్వర్షన్ లోన్స్ 
ఇప్పటికే ఒక హోమ్ లోన్ తీసుకున్నారు. అయితే, మరో ఇల్లు కొనుగోలు చేసి అందులోకి మారిపోవాలని ఉంది. అలాంటి సందర్భాల్లో కన్వర్షన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు ప్రస్తుతమున్న ఇంటి రుణాన్ని కొత్త ఇంటి రుణానికి బదిలీ చేస్తారు. అదనంగా కావాల్సిన మేర రుణం జారీ చేస్తారు. దాంతో కొత్తగా ఇచ్చే రుణం కోసం పాత బాకీని తీర్చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది.
ల్యాండ్ పర్చేజ్ లోన్స్
ల్యాండ్ పర్చేజ్ లోన్స్ అన్నవి ఓ ప్లాట్, స్థలం కొనుగోలుకు వీలు కల్పిస్తాయి. చాలా బ్యాంకులు ప్లాట్ ధరలో 85 శాతం వరకు రుణంగా అందిస్తున్నాయి. కేవలం ఇల్లు కట్టుకోవాలన్న లక్ష్యం కోసమే కాకుండా పెట్టుబడి కోసం ప్లాట్లను కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి సైతం బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీ సంస్థలు ఈ రుణాలను జారీ చేస్తున్నాయి.
స్టాంప్ డ్యూటీ లోన్స్
ఓ పెద్ద స్థలం, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. స్టాంప్ డ్యూటీకి భారీగానే వెచ్చించాల్సి వస్తోంది. సరిగ్గా ఇలాంటప్పుడే బ్యాంకులు స్టాంప్ డ్యూటీ లోన్స్ పేరుతో స్టాంప్ డ్యూటీ చార్జీలు చెల్లించడానికి అవసరమైనంత మేర రుణాన్ని అందిస్తున్నాయి.
బ్రిడ్జ్ లోన్స్
అప్పటికే ఓ ఇల్లు ఉంది. దాన్ని విక్రయిద్దామనుకుంటే వెంటనే కొనేవారు కరువయ్యారు. అదే సమయంలో మరో మంచి ఇల్లు అందుబాటు ధరలో ఉంది. సో వెనుకాడక్కర్లేదు. బ్యాంకులను ఆశ్రయించి బ్రిడ్జ్ లోన్ తీసుకోవచ్చు. అంటే కొత్తది కొనుక్కుని పాతది విక్రయించే మధ్య కాలానికి ఈ రుణం అమల్లో ఉంటుంది.  
ల్యాండ్ లోన్ హోమ్ లోన్ మధ్య తేడాలు
హోమ్ లోన్స్ అన్నవి అన్ని రకాల ఇళ్లకు వర్తిస్తాయి. ఎలాంటి ఇల్లు, ఏ ఏరియాలో కడుతున్నారు తరహా అడ్డంకులు ఏవీ ఉండవు. కానీ, ల్యాండ్ లోన్ విషయానికి వస్తే మాత్రం ఇవి కీలకం అవుతాయి. ల్యాండ్ లోన్ మాత్రం కేవలం నివాసిత స్థలానికే పరిమితం. అది కూడా మున్సిపాలిటీ, కార్పొరేషన్ లిమిట్స్ లోనే ఉండాలి. అదే సమయంలో వ్యవసాయ స్థలం కొనుగోలుకు, గ్రామాల్లో ఇంటి స్థలం కొనుగోలుకు ఈ రుణం లభించదు.
తక్కువ ఎల్టీవీ
ఆస్తి విలువలో పొందే రుణం శాతమే ఎల్టీవీ రేషియో. ఇళ్ల రుణాల్లో 80- 85 శాతం కొన్ని సందర్భాల్లో 90 శాతం వరకు రుణం పొందవచ్చు. అదే ల్యాండ్ లోన్ విషయానికొస్తే మాత్రం 70 శాతం వరకే రుణం లభిస్తుంది. ప్లాట్ విలువలో 30 శాతం సొంతంగా సమకూర్చుకుంటే బ్యాంకులు మిగిలిన 70 శాతం సమకూరుస్తాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం 85 శాతం వరకూ కూడా రుణం ఇస్తున్నాయి.
పన్ను ప్రయోజనాలు ఉండవు
గృహరుణంపై వార్షికంగా రూ.1.50 లక్షల వరకు చెల్లించే వడ్డీకి ఆదాయపన్ను పరంగా మినహాయింపు పొందవచ్చు. అంతేకాదు, గృహరుణంపై వడ్డీ కాకుండా అసలుకు చెల్లించే మొత్తానికి కూడా పన్ను మినహాయింపులు ఉన్నాయి. కానీ ల్యాండ్ లోన్ పై మాత్రం ఇలాంటి ప్రయోజనాలు ఏవీ లేవు.
ఎన్ఆర్ఐలకు అవకాశం లేదు
చాలా వరకు బ్యాంకులు ఎన్ఆర్ఐలకు ల్యాండ్ లోన్స్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఏదైనా బ్యాంకు ఇచ్చినా అధిక వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి.
తక్కువ కాల వ్యవధి
గృహ రుణాలపై కాల వ్యవధి 30 ఏళ్ల వరకు తీసుకోవచ్చు. కానీ ల్యాండ్ లోన్ తీర్చేందుకు 15 ఏళ్ల వరకే గడువు ఉంటుంది. అయితే, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే 20 ఏళ్ల వరకు కూడా అవకాశం ఇస్తోంది.
గరిష్ట పరిమితి
ల్యాండ్ లోన్స్ పై చాలా బ్యాంకులు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పరిమితి విధిస్తున్నాయి. అంటే కొనే స్థలం ధర ఎంతున్నా అంతకు మించి రుణం ఇవ్వవు. కానీ, అదే గృహ రుణం విషయంలో మాత్రం దాని వాస్తవ ధర, రుణ గ్రహీత వార్షికాదాయం, తీర్చివేయగల సామర్థ్యంపై రుణం మొత్తం ఆధారపడి ఉంటుంది.
షరతులు
చాలా బ్యాంకులు కొనుగోలు చేస్తున్న ప్లాట్ లో ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలనే ముందస్తు షరతు విధిస్తున్నాయి. ఉదాహరణకు ఎస్ బీఐ ప్లాట్ లోన్ ఇచ్చే సమయంలో కొనుగోలు అనంతరం రెండేళ్లలో ఇంటి నిర్మాణం ప్రారంభించాలనే షరతు విధిస్తోంది. అదే ఐసీఐసీఐ బ్యాంకు అయితే రెండేళ్లలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే షరతు పెడుతోంది. ఇక ఈఎంఐ, డాక్యుమెంటేషన్, సహ దరఖాస్తు దారులు, వడ్డీ రేటు విషయంలో హోమ్ లోన్, ల్యాండ్ లోన్ రెండూ ఒక్కటే.  
బ్యాలన్స్ ట్రాన్సఫర్ లోన్
ప్రస్తుతం రుణం పొంది ఉన్న బ్యాంకు సేవల తీరు నచ్చకపోయినా, అధిక వడ్డీ రేటు వసూలు చేస్తున్నారని అనిపించినా... బ్యాలన్స్ ట్రాన్సఫర్ లోన్ తీసుకోవచ్చు. అప్పుడు మిగిలి ఉన్న రుణ బకాయిని వేరొక బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు సహా చాలా బ్యాంకులు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. 
రుణం కోసం కావాల్సిన పత్రాలు
స్వయం ఉపాధి, వ్యాపారస్తులు అయితే... గుర్తింపు ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ, పాస్ పోర్ట్ ఫొటోలు, గత మూడు సంవత్సరాల ఆదాయ వివరాలు, వ్యాపారస్తులయితే గత మూడు సంవత్సరాల బ్యాలన్స్ షీట్లు, విద్యార్హతల ధ్రువీకరణ, వ్యాపారం నిర్వహణలో ఉందన్న ఆధారం, మూడు సంవత్సరాల ఆదాయపన్ను రిటర్నులు ఇవ్వాల్సి ఉంటుంది. వేతన జీవులు అయితే... గుర్తింపు, నివాస ధ్రువీకరణలు, పాస్ పోర్ట్ సైజు ఫొటో, గత ఆరు నెలల బ్యాంకు స్టేట్ మెంట్, ఫామ్ 16, తాజా వేతన స్లిప్ ఇస్తే సరిపోతుంది. 
డౌన్ పేమెంట్
రుణ దరఖాస్తు దారులు నిర్మాణ వ్యయం, లేదా ల్యాండ్ లోన్ అయితే కొనుగోలు ఖరీదులో తమ వంతుగా 15 శాతం నుంచి 30 శాతం వరకు సమకూర్చుకోవాలి. దీన్నే డౌన్ పేమెంట్ అంటారు. అప్పుడు మిగిలిన మేర బ్యాంకులు రుణాలుగా అందిస్తాయి.
అర్హతలు
నెలవారీ ఆదాయం, వ్యక్తిగత రుణ చరిత్ర ప్రధానంగా పరిశీలనకు వచ్చే అంశాలు. ఉదాహరణకు రవి వేతన జీవి. నెలకు రూ.25వేల వేతనం. అప్పుడు నెల వేతనానికి 40 నుంచి 60 రెట్లు అంటే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు రుణ అర్హత లభిస్తుంది.
సహ దరఖాస్తుదారులు
జీవిత భాగస్వామి, తండ్రి, తల్లి, కుమారుడు, సోదరుడు సహ దరఖాస్తుదారులుగా అర్హులు. వీరితో కలసి సంయుక్తంగా రుణానికి దరఖాస్తు చేసుకుంటే ఇద్దరు దరఖాస్తు దారుల ఆదాయన్ని కలిపి రుణ అర్హతను నిర్ణయిస్తారు.
ఫిక్స్ డ్, ఫ్లోటింగ్ వడ్డీ రేటు
స్థిర వడ్డీ రేటు అన్నది మారకుండా స్థిరంగా ఉంటుంది. కానీ, కొన్ని బ్యాంకులు కేవలం ఐదేళ్ల వరకే ఈ ఫిక్స్ డ్ రేటు ఉంచేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఆ తర్వాత బ్యాంకు ప్రైమ్ లెండింగ్ రేటు ఆధారంగా చర వడ్డీ రేటుకు మారుస్తున్నాయి. చర వడ్డీ రేటు అనేది స్థిరంగా ఉండకుండా మారుతుంటుంది. బ్యాంకులు తమ రుణాల రేటును (పీఎల్ఆర్)ను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంటాయి. ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లలో మార్పులు చేస్తే ఆ మేరకు తమ పీఎల్ ఆర్ లోనూ మార్పులు చేస్తాయి. ఆ వెంటనే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు కూడా మారిపోతుంది. ఫ్లోటింగ్ నుంచి ఫిక్స్ డ్ రేటుకు, ఫిక్స్ డ్ రేటు నుంచి ఫ్లోటింగ్ రేటుకు మారే అవకాశం కూడా ఉంది. 
ప్రైమ్ లెండింగ్ రేటు
బ్యాంకులు నిధుల సేకరణకు వ్యయం చేస్తుంటాయి. ఉదాహరణకు ఓ ఖాతాదారుడు లక్ష రూపాయల డిపాజిట్ చేస్తే బ్యాంకులు 8 శాతం వడ్డీ రేటును ఇస్తున్నాయనుకుందాం. అప్పుడు బ్యాంకులు 8 శాతంతోపాటు వాటికి అదనంగా నిర్వహణ, ఇతర వ్యయాలను కలిపితే ఇది సుమారు 9 నుంచి 10 శాతం మధ్యలో ఉంటుంది. ఇదే రుణ సేకరణ వ్యయం అవుతుంది. ఇదే లక్ష రూపాయలను రుణం కోరుకునే వారికి ఇచ్చినప్పుడు తన నిధుల సేకరణ వ్యయానికి కొంత కమిషన్ అర శాతం నుంచి ఒక శాతం కలుపుకుని హోమ్ లోన్స్ పై వడ్డీని ఖరారు చేస్తుంటాయి. అదే పర్సనల్, క్రెడిట్ కార్డులపై వడ్డీ రేట్లు భారీగా ఉంటాయి.
ఈఎంఐ
రుణ వాయిదా మొత్తం మారకుండా చివరి వరకు ఒకేలా ఉంటుది. వడ్డీ పెరిగితే రుణ చెల్లింపు కాల వ్యవధి పెరుగుతుందే తప్ప నెల వాయిదా పెరగదు.
ప్రీ పేమెంట్ చార్జ్
రుణ కాల వ్యవధి పూర్తి కాకముందే రుణం తీర్చేస్తే మిగిలి ఉన్న కాలం, బకాయిపై 0.5 నుంచి 2 శాతం వరకు ప్రీ పేమెంట్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు.
ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు
తక్కువ వడ్డీ రేటు ప్రయోజనాలు కస్టమర్లకు లభించాలన్న సదాశయంతో బ్యాంకులు హోమ్ లోన్ ట్రాన్స్ ఫర్ కు అవకాశం కల్పించాలని ఆర్ బీఐ కోరడంతో ఇది సాకారమైంది. రుణాన్ని మరొక బ్యాంకుకు బదిలీ చేసుకోవాలనుకుంటే... ముందు ప్రస్తుతం రుణం ఇచ్చిన బ్యాంకుకు దరఖాస్తు అందజేయాలి. దాన్ని పరిశీలించిన అనంతరం బ్యాంకు సమ్మతి తెలుపుతూ ఎన్ఓసీ (నిరభ్యంతర లేఖ) లెటర్ ను జారీ చేస్తుంది. అలాగే, మిగిలి ఉన్న రుణానికి సంబంధించిన స్టేట్ మెంట్ ను కూడా జారీ చేస్తుంది. వీటిని కొత్తగా రుణం తీసుకునే బ్యాంకుకు సమర్పించాలి. 
అలాగే కొత్తగా రుణం తీసుకునే సమయంలో ఉన్నట్టుగా మిగిలిన అన్ని నిబంధనలను పాటించాలి. ఎస్టిమేషన్ వేల్యూ, లీగల్ వెరిఫికేషన్ వంటివి అనమాట. ఇతర డాక్యుమెంట్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్తి పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. దాంతో మిగిలి ఉన్న రుణాన్ని పాత బ్యాంకుకు కొత్త బ్యాంకు తీర్చివేస్తుంది. అయితే, రుణ కాల వ్యవధి పాత బ్యాంకులో ఉన్నట్టుగానే ఉంటుంది. దాన్ని పెంచడం, ఈఎంఐ తగ్గించడం వంటి అభ్యర్థనలను కొత్తగా రుణం ఇచ్చే బ్యాంకు పరిశీలించకపోవచ్చు.
చివరిగా ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారు... రుణ కాల వ్యవధి తొలి నాళ్లలో పరిశీలించడమే లాభదాయకం. ఉదాహరణకు 20 ఏళ్ల రుణ కాలంలో 10, 15 ఏళ్లు గడిచిన తర్వాత దాన్ని బదిలీ చేసుకోవడం వల్ల పెద్ద లాభం ఉండదు. అందుకే కాల వ్యవధిలో మొదటి 25 శాతం గడువులోపే దీన్ని పరిశీలించడం లాభదాయకం.

ప్రభుత్వ హామీతో కూడిన పెన్షన్ పథకం...అటల్ పెన్షన్ యోజన పథకం!

ప్రభుత్వ హామీతో కూడిన పెన్షన్ పథకం...అటల్ పెన్షన్ యోజన పథకం!

60వ ఏట నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ అందించే లక్ష్యంతో కూడినదే అటల్ పెన్షన్ యోజన పథకం. కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకంలో ఈ ఏడాది మార్చిలోపు చేరితే... ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో రూ.5వేల వరకు వారి పెన్షన్ ఖాతాలో జమ చేస్తుంది. ఆ ప్రయోజనం అందుకోవాలంటే మార్చి లోపు పథకంలో చేరాలి. కచ్చితమైన హామీతో కూడిన పెన్షన్ పథకం ఇది. నెలనెలా చెల్లించే చందా మొత్తాన్ని బట్టి 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ అందుకోవచ్చు. ఈ స్కీమ్ ను ప్రభుత్వ రంగంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీయే) నిర్వహిస్తోంది. ఈ పథకంలో ఉన్న మంచి చెడుల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం... 
అందరూ అర్హులే...
భారతీయ పౌరులు ఎవరైనా ఇందులో చేరవచ్చు. అయితే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ సౌకర్యం ఉన్నఇతర వర్గాల వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తన వంతు రూ.5వేల చందా చెల్లించదు. ఇది తప్ప మిగతా ప్రయోజనాలన్నీ అందరికీ ఒకటే. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 60వ ఏట నుంచి పెన్షన్ ప్రారంభం అవుతుంది. 
బ్యాంకు ఖాతాతో
ముందుగా ఈ ఖాతా ప్రారంభించాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఖాతా లేకపోతే ఏదేనీ బ్యాంకులో ఖాతా ప్రారంభించడం ద్వారా ఇందులో చేరవచ్చు. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, నామినీ వివరాలు తప్పనిసరి. స్కీమ్ లో చేరే సమయంలో ఆధార్ నంబర్ లేకపోతే తర్వాత అయినా సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకులు నెలవారీ చందాను వారి ఖాతా నుంచి నిర్ణీత తేదీన ఉపసంహరించుకుంటాయి. కనుక చెల్లింపు తేదీనాటికి చందా మొత్తాన్ని అందులో ఉంచాలి.
రూ.5,000 వేల వరకు పెన్షన్
చెల్లించే చందాను బట్టి పెన్షన్ 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు వస్తుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి 60వ ఏట నుంచి నెలకు 1,000 రూపాయల పెన్షన్ కోరుకుంటే ప్రతి నెలా 42 రూపాయల చొప్పున 42 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి 2వేల పెన్షన్ కోరుకుంటే.. ప్రతి నెలా 84 రూపాయలు, 3వేల పెన్షన్ కోరుకుంటే 126 రూపాయలు, 4వేల పెన్షన్ కోరుకుంటే 168 రూపాయలు, 5వేల పెన్షన్ కోరుకుంటే నెలనెలా 210 రూపాయలు చందా చెల్లించాలి. 
40 ఏళ్ల వ్యక్తి అయితే వెయ్యి రూపాయల పెన్షన్ కోసం 291 రూపాయలు, 2వేల పెన్షన్ కోసం 582 రూపాయలు, 3వేల పెన్షన్ కోసం 873 రూపాయలు, 4వేల పెన్షన్ కోసం 1,164 రూపాయలు, 5వేల పెన్షన్ కోసం 1,454 రూపాయలు నెల నెలా చెల్లించాలి. ఒకవేళ 2వేల రూపాయల పెన్షన్ కోసం చందా కడుతుంటే… కావాలంటే దాన్ని 5వేల పెన్షన్ ఆప్షన్ కిందకు మార్చుకుని అదనపు చందా చెల్లించే సదుపాయం కూడా ఉంది. అలాగే, పెన్షన్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. ఇందుకు ఏటా ఏప్రిల్ నెలలో అవకాశం ఉంటుంది. అలా మార్చుకున్నప్పుడు నెలవారీ చెల్లించే మొత్తం కూడా మారుతుంది. 
ప్రభుత్వ సహకారం... 
ఎటువంటి సామాజిక భద్రతా స్కీముల్లోను సభ్యులు కానివారు, ఈపీఎఫ్ వంటి స్కీముల్లో లేని వారు, అవ్యవస్థీకృత రంగంలోని వారికి వారి వార్షిక చందాలో సగం లేదా వెయ్యి రూపాయలు ఏది తక్కువైతే అంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు అందిస్తుంది. ఉదాహరణకు... 18 ఏళ్ల వ్యక్తి 5వేల పెన్షన్ కోసం నెల నెలా 210 రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లయితే... వార్షికంగా ఇది  2520 రూపాయలు అవుతుంది. ఇందులో సగం అంటే 1260 రూపాయలు. దీనికంటే వెయ్యి రూపాయలే తక్కువ కనుక అంతమేర ప్రభుత్వం ఏటా పెన్షన్ ఖాతాలో జమచేస్తుంది. 
వైదొలగడానికి అవకాశం ఉందా...?
సాధారణ సందర్భాల్లో ఈ స్కీమ్ నుంచి వైదొలగడానికి అవకాశం లేదు. చందాదారుడు మరణించిన సందర్భాల్లో.. లేదా మరణానికి దారితీసే వ్యాధికి గురైనప్పుడు మాత్రమే స్కీమ్ నుంచి వైదొలగేందుకు అవకాశం ఇస్తారు. 
నెలవారీ చెల్లించడంలో విఫలమైతే...
100 రూపాయల చందాకు నెలకు ఒక రూపాయి జరిమానా ఉంటుంది. 101 నుంచి 500 రూపాయల్లోపు చందాకు రెండు రూపాయలు, 501 నుంచి 1000 రూపాయల్లోపు చందాకు 5 రూపాయలు, 1000 రూపాయలకు పైబడిన చందా మొత్తానికి నెలకు 10 రూపాయల చొప్పున జరిమానా వసూలు చేస్తారు. వరుసగా ఆరు నెలల పాటు చందా చెల్లించనట్లయితే ఆ పెన్షన్ ఖాతాను స్తంభింపజేస్తారు. 12 నెలలు దాటితే డీయాక్టివేట్ అవుతుంది. 24 నెలల తర్వాత ఖాతా మూసివేయబడుతుంది. 
60 ఏళ్లకు చేరుకోగానే.. 
ఎంపిక చేసుకున్న ఆప్షన్ ప్రకారం నెలనెలా పెన్షన్ అందుతుంది. అయితే అప్పటి వరకు సమకూరిన పెట్టుబడులను వెనక్కి ఇవ్వరు. దానిపై వడ్డీని  పెన్షన్ గా అందిస్తారు. పెన్షనర్ లేదా అతడి జీవిత భాగస్వామి బతికి ఉన్నంత వరకూ పెన్షన్ అందుతుంది. 60 ఏళ్ల తర్వాత అనుకోని పరిస్థితుల్లో పెన్షన్ దారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి నెలనెలా పెన్షన్ మొత్తాన్ని అందిస్తారు. దంపతులు ఇద్దరూ మరణించినట్లయితే వారి నామినీకి కార్పస్ మొత్తాన్ని ఇచ్చేస్తారు. 1,000 రూపాయల పెన్షన్ చందాదారుల కార్పస్ 60 ఏళ్లు వచ్చేసరికి 1.7 లక్షల రూపాయలకు చేరుతుంది. అదే 2,000 రూపాయల పెన్షన్ అందుకునే వారి కార్పస్ 3.4 లక్షల రూపాయలు, 3,000 రూపాయల పెన్షన్ అందుకునే వారి కార్పస్ 5.1 లక్షల రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్ అందుకునే వారి కార్పస్ 6.8 లక్షల రూపాయలు, 5,000 రూపాయల పెన్షన్ అందుకునే వారి కార్పస్ 8.5 లక్షల రూపాయలుగా ఉంటుంది. మరణానంతరం నామినీలకు ఈ మొత్తం అందుతుంది. పూర్తి వివరాలకు, ఇతరత్రా ఏవైనా సందేహాలు ఉంటేhttps://www.npscra.nsdl.co.in/nsdl-faq.php వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చు. లేదా అన్ని బ్యాంకు శాఖల్లోనూ సంప్రదించడం ద్వారా వివరాలు పొందవచ్చు. 
5వేల రూపాయల పెన్షన్ సరిపోతుందా..?
ప్రభుత్వ హామీ... నెల నెలా 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు కచ్చితమైన పెన్షన్ ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ పెన్షన్ ఓ వ్యక్తి అవసరాలకు సరిపోతుందా? అంటే అవును అని చెప్పడం కష్టమే. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి మరో 20 ఏళ్ల తర్వాత నుంచి నెల నెలా 5వేల పెన్షన్ అందుకుంటాడని అనుకుంటే... అప్పటి జీవన వ్యయం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 5 వేల రూపాయల విలువ ఏ మూలకు? అన్నది నిపుణుల విశ్లేషణ. 
ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తికి ప్రస్తుతం రోజువారీ జీవన వ్యయం 100 రూపాయలుగా ఉంటే నెలకు 3వేల రూపాయలు సరిపోతాయి. కానీ, ఇదే వ్యక్తికి 60 ఏళ్ల వయసుకు వస్తే నెలకు 12 వేల రూపాయలకుపైన అవసరం అవుతాయి. అంటే మూడు రెట్లు అదనంగా కావాలి. ఆ విధంగా చూస్తే 5వేల రూపాయల పెన్షన్ చాలదు. ఒకవేళ ఇందులో చేరినప్పటికీ అదనపు పెన్షన్ కోసం వీలుగా తగిన మొత్తాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. 
ఏది నయం..?
ఈ స్కీమ్ లో చందాదారులు చెల్లించే మొత్తంపై 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఆర్థిక క్రమ శిక్షణ కలిగిన వారు ఈ స్కీమ్ కు  చెల్లించే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ విధానంలో పెట్టుబడి పెడితే ఇంతకంటే ఎక్కువ మొత్తమే వస్తుందని నిపుణులు చెబుతున్నమాట. కానీ, అటల్ పెన్షన్ యోజన ఈక్విటీ మార్కెట్లతో సంబంధం లేకుండా రాబడి, పెన్షన్ కు కచ్చితమైన హామీ కలది. మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్లో రాబడులకు హామీ ఉండదన్న విషయం తెలిసిందే. 
ఎన్ పీఎస్ లో ఎక్కువ కానీ…?!
ఈ స్కీమ్ లో కంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ లో చేరి నెలవారీ పెట్టుబడి పెట్టడం వల్ల అటల్ పెన్షన్ యోజనలో వచ్చినంత రాబడికీ, నిర్వహణ బావుంటే ఇంకా అధిక రాబడికి కూడా అవకాశం ఉంటుందని భావించవచ్చు. పైగా ఎన్ పీఎస్ లో 60 ఏళ్లు వచ్చిన తర్వాత 60 శాతం మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. 
అయితే అటల్ పెన్షన్ యోజనలో 5వేల రూపాయల పెన్షనర్ కార్పస్ 8.5 లక్షలుే ఉంటుంది. 8.5 లక్షలకు 7.1 శాతం నెలవారీ వడ్డీ కింద కేంద్రం 5 వేల పెన్షన్ అందిస్తుంది. ఒకవేళ ఎన్ పీఎస్ స్కీమ్ లో పెట్టుబడితో వారి కార్పస్ 11 లక్షల రూపాయలు అయిందనుకుందాం. కానీ, 20 ఏళ్ల తర్వాత కూడా ప్రస్తుతమున్న స్థాయిలోనే వడ్డీ రేట్లు ఉంటాయని ఆశించలేము కదా. అందుకని ఒక్కసారి ఈ స్కీమ్ మీకు సరిపోతుందా? లేదా? యోచించుకుని ముందడుగు వేయండి. 

PPF / EPF / VPF ... వీటిలో ఏది లాభదాయకం?


ష్టపడి సంపాదించిన మొత్తంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసి... భవిష్యత్ కు భరోసా కల్పించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ మూడు ఇంచు మించు ఒకే రకమైన ప్రయోజనాలు, భద్రతతో కూడినవి. పెట్టుబడులు, ప్రయోజనాల పరంగా వీటి మధ్య ఉన్న విభిన్నతను చూద్దాం. 
PPF ప్రజా భవిష్య నిధి పథకం
పౌరులు ఎవరైనా ఈ పథకంలో చేరి పొదుపు చేసుకోవచ్చు. కాల వ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. పొడిగించిన కాలంలో జమ చేసినా, చేయకపోయిన ఫర్వాలేదు. జమ చేసినా లేదా అప్పటి వరకూ ఉన్న మొత్తంపైనా వడ్డీ లభిస్తుంది. ఏప్రిల్ 1, 2016 నుంచి వడ్డీ రేటు 8.1శాతంగా ఉంది. ఏడాదిలో కనిష్టంగా 500 వరకు, గరిష్టంగా 1.5 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. గడువులోపు ఖాతాను పూర్తిగా మూసివేసేందుకు అవకాశం లేదు. కానీ, ఆరవ ఏట చివర్లో అంటే ఏడవ ఏడాదిలోకి ప్రవేశించిన వెంటనే కొంత మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. అది ఎలా అంటే అప్పటి వరకూ పీపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలన్స్ నుంచి కాకుండా...  నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్ మొత్తం నుంచి 50 శాతం ఉపసంహరించుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు. ఇక ఆ తర్వాత నుంచి ఏడాదికోసారి అవసరాలను బట్టి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. పెట్టే పెట్టుబడులకు, గడువు తీరిన తర్వాత అందుకునే రాబడులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఉంది. ఈపీఎఫ్, వీపీఎఫ్ రెండూ వ్యవస్థీకృత రంగంలోని వారికి పరిమితం. పీపీఎఫ్ అందరికీ అందుబాటులో ఉన్న పథకం. 
పీపీఎఫ్ తో ప్రయోజనాలు...
పీపీఎఫ్ ఖాతాను సంపాదించడం మొదలు పెట్టిన తొలి నాళ్లలోనే ప్రారంభించడం ద్వారా ఎక్కువ ప్రతిఫలాన్ని అందుకోవచ్చు. కుటుంబ అవసరాలు పెరిగి డబ్బులు అవసరం అయ్యాయనుకోండి. ఆరో ఏడాది వరకు ఆగాల్సిందే. అందుకే ముందే ప్రారంభిస్తే అవసరంలో ఆదుకుంటుంది. నెల నెలా క్రమం తప్పకుండా పీపీఎఫ్ లో జమ చేస్తేనే ఎక్కువ నిధి సమకూరుతుంది. అందుకే అవకాశం ఉన్నంత మేర, అదనంగా చేతికి అందే మొత్తాన్ని పీపీఎఫ్ లోకి మళ్లించడం ప్రయోజనకరం. ప్రతి నెలా 5వతేదీ లోపే పీపీఎఫ్ లో జమ చేయాలి. ఆ తర్వాత జమ చేస్తే ఆ మొత్తంపై ఆ నెలలో వడ్డీ రాదు. 5వ తేదీన ఖాతాలో ఉన్న బ్యాలన్స్ పైనే వడ్డీ లభిస్తుంది. పీపీఎఫ్ పై తక్కువ వడ్డీకే రుణం పొందవచ్చు. పీపీఎఫ్ వడ్డీ రేటు కంటే రుణంపై వడ్డీ రేటు కేవలం రెండు శాతమే అదనం. కనుక పర్సనల్ లోన్ కంటే పీపీఎప్ పై లోన్ తీసుకోవడమే నయం. 
EPF ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్
ఉద్యోగుల భవిష్యనిధి పథకం. వ్యవస్థీకృత రంగలో పనిచేసే ( ప్రైవేటు రంగ కంపెనీల్లో పనిచేసేవారు) వారి పదవీ విరమణ, భవిష్యత్ అవసరాల కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 8.8 శాతంగా ఉంది. ఉద్యోగి మూలవేతనం+డీఏ కలపగా వచ్చిన మొత్తంలోంచి 12 శాతాన్ని ఉద్యోగి వేతనం నుంచి సంబంధిత కంపెనీ ప్రతి నెలా మినహాయించి ఈపీఎఫ్ కు జమ చేస్తుంది. అదే విధంగా సంబంధిత కంపెనీ కూడా ఉద్యోగి తరఫున అంతే మొత్తాన్ని (12%) ఉద్యోగి భవిష్య నిధి ఖాతాకు జమ చేస్తుంది. ఉద్యోగి పదవీ విరమణ లేదా సదరు కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసేవరకు ఇది అమల్లో ఉంటుంది. కంపెనీ వాటాగా అందే మొత్తంలో కొంత భవిష్య నిధికి, మరికొంత మొత్తాన్ని పెన్షన్ ఫండ్ కు ఈపీఎఫ్ మళ్లిస్తుంది. దీంతో పదేళ్ల సర్వీసు ఉండి పదవీ విరమణ వయసుకు వచ్చిన వారికి నెలనెలా కొంత మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందిస్తుంది. కంపెనీ మారినప్పుడు ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాను అదే నంబర్ తో కొత్త కంపెనీలోనూ కొనసాగించుకోవచ్చు. లేదా ఒక కంపెనీలో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి మరో ఉద్యోగం లేకుండా  రెండు నెలల పాటు ఖాళీగా ఉంటే ఈపీఎఫ్ ఖాతాను క్లోజ్ చేసుకుని అందులో ఉన్న మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులు, రాబడులకు పన్ను మినహాయింపు పూర్తిగా కలదు. అయితే, ఓ కంపెనీలో కనీసం ఐదేళ్లు కూడా పనిచేయకుండా ఉద్యోగం మానేసి ఆ లోపే భవిష్యనిధి ఖాతాలోని నగదును వెనక్కి తీసుకోదలిస్తే పన్ను వర్తిస్తుంది. 
VPF వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్
ఈపీఎఫ్ చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న అవకాశం ఇది. వీపీఎఫ్ అనేది ప్రత్యేక పథకం కాదు. ఈపీఎఫ్ చందాదారులు తమ వేతనం నుంచి అదనంగా మరికొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలని అనుకుంటే అందుకు వీపీఎఫ్ వీలు కల్పిస్తుంది. ఉద్యోగి తన మూలవేతనం+డీఏకు సమాన స్థాయి వరకు వీపీఎఫ్ లో పొదుపు చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై ఈపీఎఫ్ వడ్డీ రేటే అప్లయ్ అవుతుంది. ఈపీఎఫ్ పథకానికి వర్తించే పన్ను మినహాయింపులు, నిబంధనలు కూడా దీనికి వర్తిస్తాయి. వీపీఎఫ్ రూపంలో పెట్టే పెట్టుబడులు ఈపీఎఫ్ ఖాతాలోనే జమ అవుతాయి.  
వేతన జీవులు అయితే పీపీఎఫ్ లో కంటే వీపీఎఫ్ లోనే జమ చేసుకోవడం ప్రయోజనం. ఎందుకంటే వీపీఎఫ్ ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది. అయితే, ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగి తన వాటాగా ఈపీఎఫ్ లో జమచేసిన  నిధి నుంచి పదవీ విరమణ సమయంలో ఉపసంహరించుకునే మొత్తంలో 60 శాతంపై పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతతో దాన్ని వెంటనే పక్కన పెట్టింది. ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చినట్టయితే వీపీఎఫ్ లో పెట్టుబడులపై పన్ను పోటు పడుతుంది. 
వీపీఎఫ్ ద్వారా నెలనెలా నిర్ణీత మొత్తాన్ని సేవ్ చేసుకోవాలనుకునే ఉద్యోగులు తమ కంపెనీ హెచ్ఆర్ విభాగంలో తెలియజేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్, వీపీఎఫ్ రెండింటిలోనూ ఉద్యోగం మానేసి ఖాళీగా ఉంటే మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. వివాహాలు, ఇళ్ల కొనుగోలు, తీవ్ర వ్యాధుల బారిన పడినప్పుడు కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అలాగే ముఖ్య అవసరాలకు రుణాన్ని కూడా పొందే సదుపాయం ఉంది. అధిక వడ్డీ రేటు ఉన్న దృష్ట్యా పీపీఎఫ్, వీపీఎఫ్ ఎక్కువ ప్రయోజనకరం. కానీ ఈ రెండు ఉద్యోగులకే పరిమితం. వృత్తులతో ఉన్నవారు, స్వయం ఉపాధితో జీవించే వారు, కార్మిక శాఖ వద్ద నమోదు కానీ చిన్న కంపెనీల్లో పని చేసేవారికి పీపీఎఫ్ ఒక్కటే అందుబాటులో ఉన్న ఆకర్షణీయమైన ఆప్షన్.